లుంగ్లెయ్(మిజోరం): మిజోరం పర్యటనలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు స్వల్ప ప్రమాదం జరిగింది. రాష్ట్ర పర్యటనకు వెళ్లిన అమిత్ షా హెలికాప్టర్ దిగుతుండగా మెట్ల మీద నుంచి జారిపడ్డారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎన్నికల పర్యటన నిమిత్తం అమిత్ షా గురువారం మిజోరం వెళ్లారు. పశ్చిమ తుయ్పుయ్ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామంలో షా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ దిగుతుండగా షా చూసుకోకుండా ఓ మెట్టు వదిలేశారు. దీంతో ఆయన కిందపడిపోయారు. వెంటనే సిబ్బంది ఆయనను లేపి షా దుస్తులకు అంటుకున్న దుమ్ము దులిపారు. ఆ తర్వాత అమిత్షా తన పర్యటనను కొనసాగించారు. కాగా.. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్గా మారింది.
మిజోరంలో నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2008 నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంతేగాక.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏకైక ఈశాన్య రాష్ట్రం కూడా ఇదే. దీంతో కాంగ్రెస్ను గద్దె దించి ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అటు హస్తం పార్టీ కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మిజోరం ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.